వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్‌

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించారు. హెలికాప్టర్‌లో గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న రేవంత్ రెడ్డి టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పురోగతిని పరిశీలించారు. పార్క్ నిర్మాణం ఎక్కడి దాకా వచ్చిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వనమహోత్సవంలో భాగంగా మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఆవరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, అధికారులు మొక్కలు నాటారు.

ఈ సంద‌ర్భంగా వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టెక్స్ టైల్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే టెక్స్ టైల్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు.

నగరంలో భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్‌ సిటీ పథకంపై అధికారులకు పలు సూచనలు చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై కూడా పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఆదేశాలు జారీ చేశారు. వాటికి సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలని చెప్పారు.