Telangana : సినీ పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణలో గత పదేళ్లలో సినీ పరిశ్రమ అనేక సమస్యలను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రంగానికి మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సినీ ల్యాబ్లో జరిగిన గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల వేడుకకు సంపూర్ణ మద్దతు ఇవ్వనుందని ప్రకటించారు.జూన్ 14న గద్దర్ అవార్డుల ఫంక్షన్ ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ కార్యక్రమం తెలంగాణ సినీ రంగానికి నూతన ఉత్సాహాన్ని అందిస్తుందని, ప్రపంచ స్థాయి అవార్డుల వేడుకలకు ధీటుగా ఈ వేడుక నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని డిప్యూటీ సీఎం వివరించారు.చలనచిత్ర అవార్డుల పంపిణీ 2011లో నిలిచిపోవడం వల్ల సినీ కళాకారులకు ప్రోత్సాహం తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ గద్దర్ అవార్డుల ద్వారా తిరిగి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ప్రజల జీవితం సినిమాల ద్వారా వెలుగులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.

గద్దర్ అవార్డులతో సినీ రంగానికి కొత్త ఊపు: డిప్యూటీ సీఎం భట్టి
చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా, అందులో పనిచేసే వారికి హౌసింగ్ ప్లాట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తుందని వెల్లడించారు. మీడియా సామాజిక అభివృద్ధికి దోహదపడే ప్రధాన వేదిక అని, దానిని కాపాడడం పాలకుల బాధ్యత అని స్పష్టం చేశారు.అవార్డుల ఎంపిక విషయంలో ఎలాంటి రాగద్వేషాలకు తావుండకూడదని, ప్రతిభ, నాణ్యత ఆధారంగా సినిమాలను ఎంపిక చేయాలని జ్యూరీ సభ్యులను కోరారు. గద్దర్ అవార్డులు కేవలం సినిమా ఘనతకే కాకుండా, పరిశ్రమను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులకూ గుర్తింపు ఇస్తాయని ఆయన అన్నారు. భవిష్యత్తు తరాలకు ఇవి స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు.
Read More : Donald Trump : పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన అమెరికా అధ్యక్షుడు