తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు కార్యక్రమానికి ఈసారి ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి. కడప జిల్లా పబ్బాపురం వేదికగా ఈనెల 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనుంది. పార్టీ శ్రేణులకు ఇది పసుపు పండగగా పరిగణితమవుతోంది. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మే 7న సభా వేదికకు టీడీపీ అగ్రనాయకులు భూమిపూజ చేయనున్నారు.
మహానాడు ప్రత్యేకత
ఈ మహానాడు ప్రత్యేకత ఏమిటంటే, పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగుతున్న తొలి మహానాడు ఇదే కావడం. దీంతో నేతలు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్తేజం నింపేలా, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి చాటేలా మహానాడు ముంగిట ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక పార్టీ భవిష్యత్ దిశగా తీసుకోబోయే నిర్ణయాలు, విధానాలు కూడా ఈ మహానాడు వేదికపై ప్రకటించే అవకాశముంది.
దాదాపు 10 లక్షల మందికి ఆహ్వానం
ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మందిని సమీకరించాలన్న లక్ష్యంతో టీడీపీ శ్రేణులు ఇప్పటికే రంగంలోకి దిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు వేదిక భద్రత, వసతులు, రవాణా, భోజనం వంటి అన్ని అంశాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పబ్బాపురం ఇకపై రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకోబోతోందనేది విశ్లేషకుల అభిప్రాయం.
Read Also : AP EAPCET : ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల