తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది మహానాడును వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మే 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు వేలాదిగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే అవకాశముంది. దీనితో ఈ భారీ ఈవెంట్కు అవసరమైన భౌతిక వసతుల ఏర్పాట్లపై పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో శ్రద్ధ వహిస్తోంది.
స్థల పరిశీలనలో టిడిపి కీలక నేతలు
శనివారం టిడిపి ఎమ్మెల్యేలు బీద రవిచంద్ర, రాంగోపాల్ రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, వాస్తు నిపుణుడు జయరామిరెడ్డి కడపలో పలు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ఈ బృందం సీకే దిన్నె మండలంలోని చెర్లోపల్లి, పబ్బవరం గ్రామాల పరిధిలోని భూములను పరిశీలించి తగిన ప్రాంతాలను ఎంపిక చేసింది. ఈ ప్రాంతం తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలకు అనుసంధానంగా ఉండడం వలన రవాణా సౌకర్యాలు మెరుగుగా ఉంటాయని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. మహానాడు ప్రాంగణం, వేదిక నిర్మాణం, భోజన శిబిరాలు, వాహనాల పార్కింగ్, నివాస ఏర్పాట్లు వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థలాలను ఎంపిక చేశారు.
భూమి యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు
స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి మద్దతుతో సంబంధిత భూముల యజమానులతో సంప్రదించి నిరభ్యంతర పత్రాలను కూడా సేకరించారు. పార్టీకి అండగా ఉండేందుకు కడప ప్రజలు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 7న (మే 7) మహానాడు ఏర్పాట్లకు భూమిపూజ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆ తర్వత నుంచే శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేసి మే 27న ఘనంగా మహానాడును ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.
Read also: Vallabaneni Vamsi:అస్వస్థతకు లోనైన వంశీ.. చికిత్స అనంతరం విజయవాడ జైలుకు తరలింపు