అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఆ పార్టీ సీనియర్ నేతల నుంచి బలంగా వినిపిస్తోన్న వేళ సోమవారం టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక పై ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని ఆ పార్టీ నేతలను ఆదేశించింది. మీడియా వద్ద కానీ, బహిరంగంగా కానీ ఈ వ్యవహారంపై స్పందించొద్దని.. ఎలాంటి ప్రకటనలు చెయ్యొద్దని స్పష్టం చేసింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని.. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దొద్దని పేర్కొంది.

నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ల నేపథ్యంలో జనసేన వర్గీయుల నుంచి కౌంటర్ అటాక్ మొదలయింది. “లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయండి… అందులో తప్పేమీ లేదు… పవన్ కల్యాణ్ ను సీఎం చేయండి” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దంటూ టీడీపీ నేతలకు సూచించింది.
కాగా, ఇటీవలే సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవీ ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఎవ్వరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తాజాగా హోంమంత్రి అనిత సైతం లోకేష్ హోంమంత్రి పై స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ అంశం పై ఎవ్వరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.