తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. ఇటీవల ఆయన ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనను టీడీపీ అధిష్ఠానం సీరియస్గా పరిగణించడంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి చెడ్డపేరు కలిగించే అలాంటి చర్యలను సహించబోమని చంద్రబాబు ఇప్పటికే స్పష్టంచేశారు.
ఇటీవల జరిగిన ఘటనపై క్రమశిక్షణా కమిటీ నివేదిక అందించినట్లు తెలుస్తోంది. పార్టీ నియమాలను ఉల్లంఘించినట్లు భావిస్తున్న కొలికపూడికి సోమవారం కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఆయన తీరు గతంలో కూడా వివాదాస్పదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పార్టీ పరువు మసకబారిందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొలికపూడి వ్యవహార శైలిపై ఇప్పటికే పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరు నియమాలను అతిక్రమిస్తుందనే ఆరోపణలతో పాటు పార్టీకి అనుకూలంగా పనిచేయడం లేదన్న విమర్శలు రావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వివాదం మీడియా హాట్ టాపిక్గా మారింది. ప్రజలు కూడా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ క్రమశిక్షణా కమిటీ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టనుంది. కొలికపూడి నుంచి వివరణ కోరిన తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పార్టీలో క్రమశిక్షణ కచ్చితంగా ఉండాలని, అలాంటి చట్టవ్యతిరేక చర్యలను సహించేది లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఇతర నేతలకు కూడా వార్నింగ్గా మారనుంది.