ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) కొనుగోలుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి పూర్తిగా పన్ను రాయితీ ఇవ్వనున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న మరో కీలక ముందడుగు.
సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 (2024-2029)ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పాలసీ అమలులో ఉన్నంత కాలం ఈవీలపై రోడ్డు ట్యాక్స్ మినహాయింపు కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు, వాతావరణ అనుకూల ఉత్పత్తులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హైబ్రిడ్ నాలుగు చక్రాల వాహనాలకు మాత్రం ఈ పన్ను రాయితీ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజిన్ ఉన్న వాహనాలకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని అధికారులు వెల్లడించారు. పర్యావరణం కోసం అందరూ సంపూర్ణ ఈవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
ఈవీల వినియోగంతో పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడకుండా, పర్యావరణ అనుకూలమైన జీవన విధానానికి ప్రజలు మారాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. రాయితీలతో ఈవీల విక్రయాలు పెరుగుతాయని, దీనితో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గుదలతో పాటు ప్రజలకు ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని అంచనా వేస్తున్నారు. పారిశుద్ధ్య వాహనాలు, ప్రయాణికుల కోసం ఉపయోగించే వాణిజ్య వాహనాలు కూడా ఈవీలా మారాలని ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్ర ప్రజలు ఈ అవకాశం ఉపయోగించుకుని పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈవీలపై ఈ పన్ను రాయితీ నిర్ణయం, రాష్ట్రం దిశగా గ్రీన్ టెక్నాలజీకి మరో మెరుగైన అడుగు అనిపించుకుంటోంది.