టీటీడీ వ్యవస్థల దుస్థితిపై ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్నఅవకతవకలపై, తీవ్రమైన నిర్లక్ష్యం చోటుచేసుకున్నాయని టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) జె. శ్యామలరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై, ముఖ్యంగా గోశాల నిర్వహణ, ఐటీ విభాగం, కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై పలు కీలక విషయాలను ఆధారాలతో సహా వెల్లడించారు. ముఖ్యంగా గోశాలల నిర్వహణలో జరిగిన అమానవీయ ఘటనలు, ఐటీ విభాగంలోని పరిపాలనా వైఫల్యాలు, కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి వంటి అంశాలపై ఆయన ఆధారాలతో సహా వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాల మేరకు టీటీడీలో విధానాలను గాడిలో పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. శుద్ధికరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఈవోగా ఆయన చేపడుతున్న చర్యలు ప్రతి భక్తునిలో విశ్వాసాన్ని కలిగించాల్సిన అవసరాన్ని సూచిస్తాయి.
గోశాలలో ఘోర నిర్లక్ష్యం – విజిలెన్స్ నివేదికల ఆధారంగా బయటపడిన నిజాలు
గత ప్రభుత్వ హయాంలో గోశాలల నిర్వహణ తీరుపై శ్యామలరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాకముందే గోశాలల్లో తీవ్రమైన నిర్లక్ష్యంతో పాటు అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, ప్రత్యేకంగా 2021 మార్చి నుండి 2024 మార్చి మధ్య కాలంలో అవి జరిగినవని వెల్లడించారు. నాణ్యత లేని దాణా, గడువు తీరిన మందులు, లేబుల్ లేని ఔషధాలు – ఇవన్నీ గోశాలల్లో నేరుగా వాడడాన్ని స్పష్టంగా గుర్తించామని తెలిపారు. అంతేకాకుండా, నాణ్యత లేని మందులు ప్రాంగణంలో ఎక్కడపడితే అక్కడ ఉండటం, అనారోగ్యంతో ఉన్న పశువులను వేరుగా ఉంచకపోవడం వంటి అమానవీయ చర్యలు గత ప్రభుత్వ పాలనలో జరిగాయని ఆయన ఆరోపించారు. మరింత దిగ్భ్రాంతికరమైన విషయంగా, కొన్ని గోవుల మరణాలను నమోదు చేయకుండా, గోశాలలో లేని గోవులకు దాణా సరఫరా చేసినట్లు చూపించి నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపించారు.
ఐటీ విభాగంలో అక్రమ నియామకాలు, సేవా టికెట్లలో దళారి వ్యవస్థ
టీటీడీ ఐటీ విభాగంలో గత హయాంలో జీఎం స్థాయి అధికారిని నిబంధనలకు విరుద్ధంగా నియమించినట్లు ఈవో ఆరోపించారు. ఈ నియామకం వల్లే ఒకే వ్యక్తి 50 సార్లు ఆర్జిత సేవా టికెట్లు పొందగలిగాడని పేర్కొన్నారు. ఇది వ్యవస్థలో అంతర్లీనంగా ఉన్న లోపాలను స్పష్టం చేస్తోంది. భక్తులకు అందించాల్సిన సేవలను మధ్యవర్తులు దోచుకుంటున్న పరిస్థితి పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్వామివారికి వినియోగించే నెయ్యి విషయంలోనూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఆయన బయటపెట్టారు. నాణ్యత లేని కల్తీ నెయ్యిని వినియోగించినట్లు గుర్తించి, అందుకు బాధ్యుడైన దాతను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు తెలిపారు.
ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో కోట్ల రూపాయల మోసం
ఆర్గానిక్ అన్నప్రసాదాల పేరిట పెద్ద ఎత్తున మోసాలు జరిగినట్లు ఈవో తెలిపారు. కేవలం రూ.3 కోట్ల విలువైన సరుకులకు రూ.25 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ఇలాంటి కొనుగోళ్లు టీటీడీకి ఆర్థికంగా భారీ భారం కలిగించాయని తెలిపారు. అంతేకాకుండా, నాణ్యత లోపాల కారణంగా వైష్ణవి డెయిరీకి ఇచ్చిన పాల సేకరణ టెండర్ను కూడా రద్దు చేశామని వెల్లడించారు. ప్రస్తుతం నందిని బ్రాండ్ నెయ్యిని వాడుతున్నామని, అన్నప్రసాదాల నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా మారుతున్న పరిపాలన
తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించే ముందు సీఎం చంద్రబాబును కలసిన విషయం గుర్తుచేస్తూ, టీటీడీలో గణనీయమైన లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దే బాధ్యత తనపై ఉందని ఈవో స్పష్టంగా తెలిపారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలన్నీ భక్తుల మనోభావాలను కాపాడే లక్ష్యంతోనే చేస్తున్నామని, భవిష్యత్తులో మరింత పారదర్శకతతో పాలనను ముందుకు తీసుకెళ్లే యత్నం చేస్తున్నామని తెలిపారు. గోశాలల సిబ్బంది కొరతకు పరిష్కారంగా 135 పోస్టుల భర్తీకి కమిటీ వేశామని, ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు.
READ ALSO: Anna Lezhneva: టీటీడీ అన్నదానానికి భారీ విరాళమిచ్చిన పవన్ కల్యాణ్ సతీమణి