ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి

నైజీరియాలో ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్లు మారణహోమం సృష్టిస్తున్నాయి. పెళ్లి వేడుకలు, అంత్య క్రియలు, ఆసుపత్రులు.. ఇలా జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా మహిళా సూసైడ్ బాంబర్లను ప్రయోగిస్తున్నాయి. తాజాగా బోర్నో రాష్ట్రంలోని గ్వోజా పట్టణంలో ఓ ఆస్పత్రి, పెళ్లిలో ఇద్దరు మహిళలు బాంబులు కట్టుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పెళ్లిలో మరణించిన వారి అంత్యక్రియలు జరుపుతుండగా మరో మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. దీంతో మూడు ఘటనలలో కలిపి 18 మరణించగా మరో 42 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులలో మహిళలు, చిన్నారులు, గర్భిణీలు కూడా ఉన్నారు. గ్వోజాలోని సెక్యూరిటీ చెక్ పోస్టు దగ్గర మరో దాడి జరిగింది. 2014లో ఉత్తర బోర్నో ప్రాంతంలోని గ్వోజాను బోకోహరం తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా భద్రతా బలగాలు 2015లో గ్వోజాను తన స్వాధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి బోకో హరం తీవ్రవాదులు గ్వోజాపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో 40 వేల మంది చనిపోగా 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.