సుప్రీం తీర్పు గవర్నర్లకు మార్గదర్శకంగా
Supreme Court : గవర్నర్ పదవి ఫెడరల్ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించాల్సిన బాధ్యతాయుతమైన స్థానం. అయితే గవర్నర్ వ్యవహారం తరచూ వివాదాలకు దారి తీస్తున్నదన్న విషయం ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం ఉన్నపుడు, కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న గవర్నర్లు ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడం వంటి ఆరోపణలు ఎదురవుతున్నాయి.ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా చెబుతారు న్యాయ నిపుణులు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి వ్యవహారంపై ఇచ్చిన తీర్పులో, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించినా, మళ్లీ అవే బిల్లులు తిరిగి ఆమోదించి పంపినప్పుడు వాటిని రాష్ట్రపతికి పంపకుండా తన వద్దే నిలిపి పెట్టడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా పేర్కొంటూ, గవర్నర్ పదవి స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించరాదని సూచించింది. బిల్లులను ఆమోదించడంలో ఆలస్యం చేయకూడదని, మూడు నెలల వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలనే స్పష్టతను కోర్టు తీర్పు కల్పించింది. అలాగే, వైస్ ఛాన్సలర్లు, ఇతర విద్యా వ్యవస్థ సంబంధిత నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై జాప్యం చేయకూడదన్న సూచన కూడా ఈ తీర్పులో ఉంది.

ఇది కేవలం తమిళనాడు గవర్నర్ విషయంలో కాక, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో స్పష్టత తీసుకురావడంతో పాటు, ఫెడరల్ వ్యవస్థను మరింత బలపరిచే దిశగా ఉన్నదని చెప్పవచ్చు.ఇప్పటికైనా గవర్నర్ వ్యవహార శైలి మారకపోతే, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం దిగజారే ప్రమాదం ఉంది. గవర్నర్ ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, రాజ్యాంగ ప్రమాణాలను గౌరవించే వ్యక్తిగా ఉండాలన్నది ఈ తీర్పు ద్వారా వెల్లడైన సందేశం.
Read More : IPL 2025: ముంబయి జట్టు అరుదైన రికార్డు నమోదు