సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

supreme-court-setback-for-aap-in-tussle-with-lt-governor-to-control-delhi

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎంసీడీ) సభ్యులను నామినేటెడ్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఎంసీడీలో 10 మంది సభ్యులను మంత్రి మండలి సలహా మేరకు నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం… ఈ నామినేషన్ అంశంలో స్థానిక ప్రభుత్వం సలహా అవసరం లేదని, ఎల్జీకి చట్టం ప్రకారం అధికారాలు ఉన్నాయని తెలిపింది.

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ యాక్ట్ నుంచి ఈ అధికారం ఎల్జీకి వచ్చిందని, కాబట్టి ఎల్జీ స్థానిక ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయనకు చట్టం ప్రకారం అధికారం ఉన్నట్లు తెలిపింది. 2022 డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 250 వార్డులకు గాను ఆ పార్టీ 134 స్థానాలను దక్కించుకుంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది కౌన్సిలర్ల చేత ప్రిసైడింగ్ అధికారి ప్రమాణం చేయించడం వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం నేడు తీర్పును వెలువరించింది.