ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

supreme-cour

న్యూఢిల్లీ: ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణ తప్పనిసరి అని, ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దీంతో దేశ వ్యాప్తంగా ఎస్సీ కులస్థులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు విచారణ సాగిన విషయం తెలిసిందే. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. సుదీర్ఘ వాదనలు అనంతరం ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.

ఎస్సీ , ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సంబంధించి ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో బీజం పడింది. 2000-2004 వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ను అమలు చేసింది. అయితే మాలమహనాడు వర్గీకరణను వ్యతిరేకించింది.. హైకోర్టులో న్యాయపోరాటం చేసింది. హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004 లో అనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేఖించింది. వివక్ష, వెనుక బడిన వాళ్లందరిని ఒకే కేటగిరిలో ఉంచాలని ఆదేశాలిస్తూ.. హైకోర్టును తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగానూ, రాజకీయ ఉద్యమాలుగానూ జరుగుతూనే ఉన్నాయి.

అయితే పంజాబ్ ప్రభుత్వం తాజాగా వర్గీకరణ చేసేందుకు సిద్ధం అవడంతో అక్కడి హైకోర్టు సుప్రీం కోర్టులోని 2004 కేసుకు రిఫర్ చేసింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలం అనే బీజేపీ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం క్యాబినేట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది. దాంతో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మూడు రోజుల పాటూ సుప్రీం కోర్టులో సుదీర్గ విచారణ జరిపింది. ఫిబ్రవరి 8 న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈమేరకు తీర్పు వెలువడింది. ఏళ్ల కల నెరవేరింది.