సుప్రీంకోర్టులో దగ్గుబాటి సురేశ్కు ఎదురుదెబ్బ
ప్రముఖ సినీ నిర్మాత, సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్కు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో ఉన్న రామానాయుడు స్టూడియోస్కు అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూములలో 14 ఎకరాలు ఇతర అవసరాలకు వాడుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, సురేశ్ ప్రొడక్షన్స్కు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ రోజు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు మద్యంతర ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది. అంతేగాక, ఈ అంశాన్ని సంబంధిత కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ పరిణామం నేపధ్యంలో, సురేశ్ ప్రొడక్షన్స్ తమ పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరగా, ధర్మాసనం ఆమోదించింది.
ప్రభుత్వ భూముల వినియోగంపై వివాదం
రామానాయుడు స్టూడియోస్ కోసం విశాఖపట్నంలో ప్రభుత్వం అప్పట్లో భారీ భూములను కేటాయించింది. అయితే అందులో 14 ఎకరాల భూమిని ఇతర అవసరాలకు వాడుకునేందుకు 2019లోని వైసీపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ, గతేడాది అధికారంలోకి వచ్చిన నూతన కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని పునర్విచారణకు తీసుకుంది. దీనిపై సురేశ్ ప్రొడక్షన్స్కు నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరింది. అదే అంశంపై సురేశ్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, న్యాయస్థానం ప్రభుత్వ వైఖరిని సమర్థించడంతో, ఈ వ్యవహారం మరింత ఉత్కంఠకు దారితీసింది.
భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది ప్రశ్న
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, రామానాయుడు స్టూడియోలకు అప్పట్లో కేటాయించిన భూముల మద్య 14 ఎకరాల భూమిని రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వ భూమిని అవినీతిమయంగా ఇతర అవసరాలకు వాడుకున్నారన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేయకుండా పిటిషన్ను తిరస్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలకు మార్గం సుగమమవుతుంది. అయితే, ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ సినీ పరిశ్రమతో పాటు రాజకీయంగా కూడా చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
read also: Chandrababu Naidu: టెక్ దిగ్గజాలతో చంద్రబాబు కీలక ఒప్పందం