ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు వేసవి సెలవులకు వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం 2024-25 విద్యా సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏప్రిల్ 23వ తేదీ (బుధవారం)తో ముగిసింది. తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. కొంతమంది విద్యార్థులు తమ స్నేహితులతో సెల్ఫీలు దిగుతూ, చివరి రోజును ఓ జ్ఞాపకంగా మిగిల్చుకున్నారు. ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులు తమ ట్రంక్ పెట్టెలు, బ్యాగులతో తమ స్వగృహాలకు పయనమయ్యారు.

హాస్టళ్ల నుంచి బయలుదేరిన వేలాది మంది విద్యార్థుల రాకతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు హడావుడిగా మారాయి. ప్రయాణంలో కూడా వారి ముఖాల్లో సెలవుల ఉత్సాహం ఉప్పొంగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలన్నీ పూర్తిగా మూతపడడంతో, ఆ వసతుల్లో ఉన్న విద్యార్థులంతా ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు.
వేసవి సెలవుల నిడివి – జూన్ 12 వరకు
తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు కొనసాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాఠశాలలు అదే తేదీలకు మూతపడ్డాయి. అయితే ఏపీలోఇంటర్మీడియట్ విద్యార్థులకు కాస్త ముందుగా విద్యా సంవత్సరం ప్రారంభించనుండటంతో, జూనియర్ కాలేజీలు జూన్ 2న తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు మాత్రం జూన్ 6న విధుల్లో చేరాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం జూన్ 13 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అంటే వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు ఇచ్చారన్నమాట. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎండలో తిరగవద్దని, ముఖ్యంగా చెరువులు, కుంటలు, బావుల వద్దకు సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విద్యాశాఖ అధికారులు బడి పిల్లలకు సూచించారు. తమ పిల్లలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు.
Read also: CM Revanth Reddy :హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం