ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ) నెట్వర్క్ ఆస్పత్రుల్లో నేటి నుంచి సమ్మె కొనసాగనుంది. రూ.2,500 కోట్ల బకాయిలకుగాను రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు నిరాశకు గురయ్యాయి. త్వరలోనే మరో రూ.300 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వ వర్గాలు హామీ ఇచ్చినా వెనక్కు తగ్గలేదు. గతంలో ఇచ్చిన సమ్మె నోటీసుకు అనుగుణంగా ఈరోజు నుంచి సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశాయి.

2023 సెప్టెంబర్ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500 కోట్లు వారికి ప్రభుత్వం బకాయిపడింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం రూ.160 కోట్లు విడుదల చేసినా.. వారు శాంతించలేదు. ఆస్పత్రులకు రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, అందుకే సేవలు కొనసాగించలేమని ప్రభుత్వానికి ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాసింది.

ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఎలక్షన్ కోడ్ వల్ల ఆరోగ్యశ్రీ నిధులను ఆసుపత్రులకు జమ చేయలేదని వైసీపీ అంటోందని.. నిస్సిగ్గుగా ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు ఏపీ వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్. వైసీపీ హయాంలో రూ. 2100 కోట్లు చెల్లించకుండా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఇబ్బంది పెట్టారని, ఆ భారాన్ని కొత్త ప్రభుత్వంపై నెట్టారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తమదేనని, ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించిన చరిత్ర వైసీపీది అని విమర్శించారు హెల్త్ మినిస్టర్ సత్య కుమార్.