ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగం విజయవంతం

SSLV-D3 launch successful

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయటం, అందుకు అనుకూలమైన పేలోడ్‌ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ‘ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌’ ఈవోఎస్‌-08ను తక్కువ ఎత్తులోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్‌ లక్ష్యం. దాదాపు 6 నెలల తర్వాత ఇస్రో చేపడుతున్న రాకెట్‌ ప్రయోగమిది. కేవలం రెండు రోజుల ప్రణాళికతో చిన్న చిన్న శాటిలైట్స్‌ను తక్కువ ఖర్చుతో భూ కక్ష్యలోకి చేర్చేందుకు ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 రాకెట్‌తో సాధ్యమవుతుందని ఇస్రో మాజీ సైంటిస్టు ఒకరు చెప్పారు.

ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఈవోఎస్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ (ఈవోఐఆర్‌) పెలోడ్‌ మిడ్‌-వేవ్‌, లాంగ్‌ వేవ్‌ ఇన్‌ఫ్రా-రెడ్‌లో చిత్రాలను క్యప్చర్‌ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుందని ఇస్రో పేర్కొంది.