శ్రీవారి లడ్డూ వివాదం..తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: సిఎం చంద్రబాబు

chandrababu naidu
CM Chandrababu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారం పై మీడియాతో చిట్ చాట్ సందర్భంగా స్పందించారు. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టే పరమ పవిత్రమైన లడ్డూ తయారీకి రివర్స్ టెండర్లేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల ఆలయం సెట్టింగ్ ను ఇంట్లో వేసుకున్న వారిని ఏమనాలి? అంటూ ఎత్తిపొడిచారు. ఆచారాలను, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలపై దృష్టి సారించామని… టీటీడీని ప్రక్షాళన చేయాలని కొత్త ఈవోకు చెప్పానని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక లడ్డూ నాణ్యత పెంచి, పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందని చంద్రబాబు వివరించారు. లడ్డూ నాణ్యత పెంచడం కోసం నందిని సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేశారని తెలిపారు.

ప్రక్షాళన చేయమని చెప్పడం ఆలస్యం… అన్ని పనులు చకచకా చేసేశారని టీటీడీ ఈవో శ్యామలరావును అభినందించారు. ఇవన్నీ ఆయన ప్రతి రోజూ బయటికొచ్చి చెప్పుకోలేదని… ఈవోగా తన పని తాను చేసుకుంటూ పోయారని కితాబిచ్చారు.

టీటీడీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తున్నామని… జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంప్రోక్షణ తీరుతెన్నులు ఎలా ఉండాలో సలహాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నాణ్యత పరీక్షలు, సంప్రోక్షణ చేపట్టాలనుకుంటున్నామని… ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నామని వివరించారు.

కాగా, . కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశం చాలా సున్నితమైందని చెబుతూ.. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో లడ్డు తయారీ అపవిత్రంగా మారిందని, తయారీ పక్రియలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై తాము సీరియస్ గా విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని భక్తులకు ఆయన హామీ ఇచ్చారు.