ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టిపెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ ఫెయిలైన విద్యార్థులకు వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు (స్పెషల్ క్లాసులు) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల కోసం కూడా ఈ తరగతులు వర్తించనున్నాయి. ఈ చర్య ద్వారా విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం పెరిగి, వచ్చే పరీక్షల్లో విజయం సాధించేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం.

వచ్చే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు
ఈ స్పెషల్ క్లాసులను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) హాస్టళ్లను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ తరగతులకు అనుభవం కలిగిన అధ్యాపకులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు శ్రమపడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, వచ్చే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులలో 44 శాతం మంది
ఇక ఫలితాల విషయానికి వస్తే, ఆదర్శ పాఠశాలల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులలో 44 శాతం మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులలో 18 శాతం మంది ఫెయిలైనట్లు సమాచారం. ఈ సంఖ్య కాస్త ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం ముందుగానే స్పందించి ఈ ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయడం శుభపరిణామంగా చెబుతున్నారు. ఈ తరగతులు విద్యార్థుల ఆశలు చిగురించేందుకు, వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవనున్నాయి.