సియోల్: ఏఐ రంగంలో తాజా సంచలనం కలిగించిన చైనా సంస్థ డీప్సీక్ ఒకవైపు దూసుకెళ్తోంది. మరోవైపు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు దీనిని నిషేధించగా.. తాజాగా దక్షిణ కొరియా కూడా ఆ జాబితాలో చేరింది. ఆ దేశ రక్షణ, వాణిజ్య కంప్యూటర్లలో డీప్సీక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. డీప్సీక్ వినియోగంపై పలు దేశాల నుంచి వచ్చే ఆందోళనల దృష్ట్యా, దీనిని నిషేధించాలన్న నిర్ణయానికి చేరుకున్నాం. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సాంకేతికతను జాగ్రత్తగా ఉపయోగించాలి. యూజర్ల వ్యక్తిగత సమాచార సేకరణ వ్యవస్థ సంబంధిత వివరాలు స్పష్టంగా తెలియడం లేదు అని రక్షణ, వాణిజ్య మంత్రిత్వశాఖలు సంయుక్తంగా చెప్పారు.

దేశం పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా ఇదే హెచ్చరికలను జారీ చేసినట్లు సమాచారం. అమెరికాలో చైనాకు చెందిన ప్రభుత్వ టెలికాం సంస్థతో డీప్సీక్కు సంబంధాలు ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. కంప్యూటర్ కోడ్ ద్వారా యూజర్ల లాగిన్ సమాచారాన్ని ఆ టెలికాం సంస్థకు అందజేస్తుందని వారు తెలిపారు. మొదట కెనడాకు చెందిన ఫీరూట్ సెక్యూరిటీ సంస్థ ఈ విషయం గుర్తించి, అసోసియేట్ ప్రెస్ న్యూస్ ఎజెన్సీతో పంచుకుంది. ఈ వివరాలను స్వతంత్ర కంప్యూటర్ నిపుణులు ధృవీకరించారు. అయితే, ఈ డేటా బదిలీ జరిగిందో లేదా అన్నది మాత్రం ఈ సంస్థలు గుర్తించలేకపోయాయి. ఈ ఆరోపణలపై డీప్సీక్ గానీ, చైనా మొబైల్ గానీ స్పందించలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో, డీప్సీక్ సేవలను ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ వంటి దేశాలు ఇప్పటికే నిషేధించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ కంప్యూటర్లు, డివైజుల వాడకంపై నిషేధం విధించింది, అయితే వ్యక్తిగత డివైజులపై ఎలాంటి నిషేధం లేదు. అక్కడి ప్రభుత్వం పౌరులకు డీప్సీక్ వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రైవసీ పై సమస్యలను పరిష్కరించడంలో డీప్సీక్ విఫలమైన తర్వాత, ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ చాట్బాట్ను బ్లాక్ చేస్తూ ప్రకటించింది. అలాగే, తైవాన్ కూడా ప్రభుత్వ సంస్థలలో డీప్సీక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.