త్వరలోనే కేజ్రీవాల్‌ కూడా జైలు నుండి విడుదలవుతారు: సిసోడియా

Soon Kejriwal will also be released from jail: Sisodia

న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో అరెస్టై దాదాపు 17 నెలలు జైలు జీవితం అనుభవించిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియా ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నాట్‌ ప్లేస్‌ లోని హనుమాన్‌ మందిర్‌ ను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ.. బజరంగ్‌ బలి ప్రభువు ఆశీస్సులు తనపై ఉన్నట్లు చెప్పారు. ఆయన ఆశీర్వాదంతోనే తాను జైలు నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా హనుమాన్‌ ఆశీస్సులు ఉన్నాయని, తనలానే సీఎం కూడా త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన కేసుల్లో సిసోడియాకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం సిసోడియా తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందు.. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో, ఇద్దరు ష్యూరిటీ తీసుకొని ఆయనను విడుదల చేయాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.

ఈ సందర్భంగా సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ప్రతీ సోమవారం, గురువారం ఏజెన్సీల అధికారుల ముందు హాజరుకావాలని ధర్మాసనం కొన్ని షరతులు విధించింది. కాగా, ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో కిందటేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాను అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉన్నారు.