తెలంగాణ రాష్ట్రంలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విపక్షాలు, ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారి పేరుతో ఈ వ్యవహారం మరింత ఊపందుకుంది. ‘హాయ్ హైదరాబాద్’ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మార్చి 31న పోస్ట్ చేసిన ఓ ఫోటోను రీట్వీట్ చేసినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆ ఫోటోలో మష్రూమ్ రాక్ ఎదుట బుల్డోజర్లు, వాటి ఎదురుగా నెమళ్లు, జింకలు ఉన్నట్టు చూపించారు. ఈ ఫోటో ఫేక్గా పేర్కొంటూ పోలీసులు అభియోగాలు మోపారు.

గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తి సహకారం
ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ స్పందిస్తూ, గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తి సహకారం అందించానని తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. తాను షేర్ చేసిన పోస్ట్ను అప్పటికే వేలాది మంది షేర్ చేశారని పేర్కొన్నారు. తనపై చర్యలు తీసుకుంటూ, అదే పోస్ట్ షేర్ చేసిన మిగిలిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తారా? లేదా చట్టం అందరికీ సమానమా? అని ఆమె వ్యాఖ్యానించారు.
అధికారులపై ప్రభుత్వ వైఖరిపై అనేక సందేహాలు
ఈ వ్యవహారం ద్వారా అధికారులపై ప్రభుత్వ వైఖరిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత అభిప్రాయాలు తెలిపినవారిపై ప్రభుత్వ నిఘా, పోలీసు చర్యలు స్వేచ్ఛను ఖూనీ చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్మితా సబర్వాల్ వంటి నిష్కళంక అధికారిని టార్గెట్ చేయడం పట్ల పలువురు ఉద్యోగులు, సామాజిక వేత్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వివాదం ఏ దిశగా సాగుతుందో అన్నది వేచి చూడాల్సిందే.