సీతారామ ప్రాజెక్టు ట్ర‌య‌ల్ ర‌న్ స‌క్సెస్

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వాపురం మండలం బీ.జీ. కొత్తూరు వద్ద బుధ‌వారం అర్ధ‌రాత్రి సీతారామ ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ ట్ర‌య‌ల్ రన్ ను ఇరిగేషన్ అధికారులు నిర్వ‌హించారు. తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు గురువారం ప‌రిశీలించారు. గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతుండటంతో ఆయన ఒక్కసారిగా పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు సమస్కరించారు.

సీతారామ ప్రాజెక్టు ట్ర‌య‌ల్ ర‌న్ విజ‌య‌వంతం కావ‌డంతో.. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణను పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కల నిజ‌మైంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ. 17 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. గంగమ్మ జల సవ్వడులతో ఖమ్మం నేల త‌డిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగు నీరు అంద‌నుంది. పంపుల నుంచి ఎగిసిప‌డ్డ జ‌లాల‌ను చూసి ఆయ‌క‌ట్టు రైతులు సంతోషం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఉభ‌య ఖ‌మ్మం జిల్లాల‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌న్న త‌న క‌ల నెర‌వేరింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడం తన‌ జీవిత ఆశయమ‌ని గ‌తంలో ఎన్నోసార్లు చెప్పాన‌ని గుర్తు చేశారు. ఆగస్టు 15 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వడమే తన చిర‌కాల‌ కోరిక అన్నారు. గోదావరి జిల్లాల మాదిరిగా ఖమ్మం జిల్లాలో సాగు ఇవ్వాలన్నది తన ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. సీతారామ ప్రాజెక్ట్‌కు భూమి ఇచ్చిన వారికి పాదాభివందనాలు తెలిపారు. ఈ వర్షాకాలంలోనే లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.