Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడలో సిట్ కార్యాలయానికి ఆయన ఈరోజు ఉదయం వచ్చారు. అనంతరం అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో.. భారీగా అనుచిత లబ్ధి పొందిన కంపెనీల్లో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనక రాజ్ కసిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఉన్నారని వైసీపీ మాజీ నేత వి.విజయసాయిరెడ్డి నిన్న బయటపెట్టిన విషయం తెలిసిందే.

విజయసాయి రెడ్డి ఇంట్లో 2 దఫాలుగా జరిగిన చర్చలు
విజయసాయి రెడ్డి ఇంట్లో 2 దఫాలుగా జరిగిన చర్చలపై మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అనంతరం మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు లాయర్ సమక్షంలో మిథున్ రెడ్డిని సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని బృందం ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్యరాజ్లతో సంభాషణలపై అతడిని ఆరా తీసినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీపై జరిగిన సంభాషణలపైనా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి వెల్లడించిన వివరాల ఆధారంగా మిథున్రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Read Also: కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం