Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి పై మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారుల విచారణ శనివారం(ఈరోజు) ముగిసింది. నేడు ఉదయం విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్రెడ్డిని దాదాపు 8 గంటల పాటు సిట్ బృందం విచారించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. వివిధ అంశాలపై ఆరా తీసిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరోసారి ఆయన్ను పిలిచే అవకాశముంది.

మద్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా ప్రశ్నలు
మిథున్రెడ్డిని కోర్టు ఉత్తర్వుల మేరకు న్యాయవాది సమక్షంలో విచారించారు. మద్యం పాలసీ రూపకల్పన, మిథున్రెడ్డి ప్రమేయం, డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డికి చెందిన ఆడాన్ డిస్టిలరీ, డికార్ట్ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎంతమేర కొనుగోళ్లు చేసిందని ప్రశ్నించినట్లు సమాచారం. రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరులు చాణక్య రాజ్, అవినాష్రెడ్డిలతో మిథున్రెడ్డికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి సిట్ అధికారులు ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు తమ కుటుంబం ఎన్నో కేసులు పెట్టినా ఏ ఒక్కటీ నిరూపించలేకపోయిందని ఆయన విమర్శించారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగమేనన్నారు. సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున, ఈ వ్యవహారంలో ఇప్పుడేమీ మాట్లాడలేనని వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు.
Read Also: కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం