విశాఖపట్నం సింహాచలం ఆలయంలో జరిగిన చందనోత్సవంలో గోడ కూలిన విషాద ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఆమెను ఎదుర్కొన్న బాధిత కుటుంబాలు ఒక్కో కుటుంబానికి కనీసం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. తమ ప్రాణాలను కోల్పోయిన కుటుంబ సభ్యుల స్థాయికి తగిన న్యాయం జరగాలంటూ బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రూ.25 లక్షల పరిహారం
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వం ఇప్పటికే రూ.25 లక్షల పరిహారంతో పాటు, ఒక్కో కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మృతుల పిల్లల విద్యాభవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం భాద్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గోడ కూలిన సంఘటనపై కమిటీని ఏర్పాటు చేసి, 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Read Also : Simhachalam : సింహాచలం ప్రమాదానికి కారణం అదేనా..?
గోడ నిర్మాణంలో లోపాలు
గోడ నిర్మాణంలో ఏవైనా నాణ్యతా లోపాలు ఉన్నాయా? కాంట్రాక్టు ఎవరి వద్ద ఉంది? నిర్మాణ అనుమతులు ఎలా మంజూరయ్యాయి? అనే అంశాలపై సమగ్రంగా దర్యాప్తు జరుగుతుందని హోంమంత్రి వెల్లడించారు. ఇది ఊహించని ఘటన అని, తాను కూడా వర్షం కురుస్తున్న సమయంలో అక్కడే దర్శనానికి వచ్చానని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించామని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం స్పందించిందని తెలిపారు. ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, విచారణలో ఎవరి తప్పులైనా బయటపడితే, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టంగా హెచ్చరించారు.