అమరావతి: వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు, పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ మురళీకృష్ణకు షాక్ ఇచ్చేందుకు కార్పొరేషన్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గుంటూరులోని పట్టాభిపురంలో ఆయన నిర్మించిన గ్రీన్గ్రేస్ అపార్ట్మెంట్కు నగరపాలక, రైల్వే, అగ్నిమాపకశాఖ, పీసీబీ నుంచి పూర్తిస్థాయి అనుమతులు తీసుకోలేదన్న కారణంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కాగా, గుంటూరులోని పట్టాభిపురంలో అపార్ట్ మెంట్ నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన కార్పొరేషన్.. రైల్వే.. ఫైర్.. పీసీబీల నుంచి పూర్తి స్థాయి అనుమతులు తీసుకోలేదు. అంతేకాదు.. కార్పొరేషన్ కు చెల్లించాల్సిన ఫీజు కూడా కట్టలేదు. రైల్వే శాఖ కేవలం జీప్లస్4 నిర్మాణానికి అనుమతి ఇస్తే.. నాలుగు రెట్లు ఎక్కువగా నిర్మాణాలను నిర్మించటం గమనార్హం. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు తాము ఇచ్చిన అనుమతులకు భిన్నంగా భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపట్టిననేపథ్యంలో రైల్వే శాఖ ఇచ్చిన ఎన్ వోసీని రద్దు చేసింది. ఇదంతా ఏడాది క్రితమే జరిగినా.. అప్పట్లో అంబటి అధికారంలో ఉండటంతో వారిని అడ్డుకునే వారే లేకపోయారు.
అయితే దీనికి ఆయన స్పందించకపోవడంతో దానిని కూల్చడం, లేదంటే సీజ్ చేయడం, లేదంటే ప్రాసిక్యూషన్ కోసం కోర్టుకు వెళ్లడంలలో ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక, తాజాగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఈ ఇష్యూను తెర మీదకు తీసుకురావటం.. ప్రశ్నించటంతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రివైజ్డ్ ప్లాన్ తోనూ నిర్మాణదారుడు మోసంచేసిన విషయాన్ని గుర్తించిన అధికారులు అవాక్కు అయ్యారు. రైల్వే శాఖ ఇచ్చిన ఎన్ వోసీ రద్దు విషయాన్ని దాచి పెట్టేసి.. బరితెగింపునతో నిర్మాణం చేపట్టిన వైనం సంచలనంగా మారింది. దీంతో క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు.