ఓల్డ్ సిటీ లో అర్ధరాత్రి కాల్పుల మోత..

గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస హత్యలు నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ లో వరుస పెట్టి రౌడీ షీటర్లు హత్యకు గురి అవుతున్నారు. ఇప్పటికే పలువుర్ని అతి దారుణంగా హత్య చేయగా…తాజాగా బాలాపూర్ లో మరో హత్య జరిగింది.

బాబానగర్ సీ-బ్లాక్‌కు చెందిన రియాజ్ అలియాస్ మెంటల్ రియాజ్ (45) కంచన్‌బాగ్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్. గురువారం అర్ధరాత్రి బాలాపూర్ మంచి స్కూల్ సమీప ప్రాంతం నుంచి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే మాటు వేసిన దుండగులు పథకం ప్రకారం గుర్తు తెలియని కారుతో రియాజ్ బైక్‌ను ఢీకొట్టారు. అతడు కింద పడిపోయిన వెంటనే ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రివాల్వర్‌తో మూడు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. స్పాట్‌లో కింద పడిన ఓ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రియాజ్ ఛాతి, శరీరంలోని ఇతర భాగాలలో గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రియాజ్‌ను ఎవరు హతమార్చారు.. కారణం ఏంటనే విషాయాలు తెలియాల్సి ఉంది.