ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఇచ్చిన కీలక తీర్పులో ఎస్సీ (SC) కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన వెంటనే అతనికి ఎస్సీ హోదా ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) చట్టంలోని రక్షణలు కూడా అతనికి వర్తించవని న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పు సామాజికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మతం మారితే ప్రాథమికంగా కుల గుర్తింపు ఎలా మారుతుందన్న అంశంపై స్పష్టత ఇచ్చిన తీర్పుగా దీనిని భావిస్తున్నారు.
ఐదుగురు కుల వివక్షతో దాడి
ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి: 2021లో చింతాడ ఆనంద్ అనే క్రైస్తవ పాస్టర్, తాను ఎస్సీ కులానికి చెందిన వాడినని, తనపై రామిరెడ్డి సహా ఐదుగురు కుల వివక్షతో దాడి చేశారని, దూషణలకు గురిచేశారనీ పేర్కొంటూ చందోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, ఫిర్యాదుదారుడు మతాన్ని మార్చుకున్న వ్యక్తి కాబట్టి అతనికి ఎస్సీ హోదా ఉండదని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ఎస్సీ హోదా వర్తించదనీ తీర్పు
వాదనలు పరిశీలించిన ఏపీ హైకోర్టు, అభియోగాలపై విచారణ జరిపి, పాస్టర్ ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారినట్లు స్పష్టమవుతుందనీ, అందువల్ల అతనికి ఎస్సీ హోదా వర్తించదనీ తీర్పునిచ్చింది. తద్వారా అతను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం రక్షణ పొందలేడని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. ఈ తీర్పు మరిన్ని న్యాయపరమైన దిశల్లో చర్చకు దారితీసే అవకాశముంది.
Read Also : Modi : ఏపీకి మోడీ రాక..కట్టుదిట్టమైన భద్రత