భారత్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉంది..పాక్‌కు సాయం నిషేధించాలి: అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు

senator-rubio-introduces-us-india-defense-cooperation-act

వాషింగ్టన్‌: మిత్రదేశాలైన జపాన్‌, ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్‌ను చూడాల్సిన అవసరం ఉందని అమెరికా సెనేటర్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికన్‌ కాంగ్రెస్‌ లో కీలక సభ్యుడు మార్కో రుబియో గురువారం ఓ బిల్లు ప్రవేశపెట్టారు. భారత్‌తో సైనిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అసవరం ఉందని బిల్లులో పేర్కొన్నారు.

భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఈ బిల్లు గుర్తు చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తేలితే పాకిస్థాన్‌కు భద్రతా సాయాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సాంకేతికత బదిలీ, ఆయుధాల సహకారంలో భారత్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని బిల్లు ప్రతిపాదిస్తోంది.

మరోవైపు ఇండో – పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దురాక్రమణ వైఖరిని అనుసరిస్తోందని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశ పెట్టిన బిల్లు స్పష్టం చేస్తోంది. ఇది ఆ ప్రాంతంలోని అమెరికా భాగస్వామ్య దేశాల సార్వభౌమాధికారాన్ని, స్వయంప్రతిపత్తికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకోవాలంటే భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం చాలా కీలకమని వెల్లడించింది.

అయితే, ఈ బిల్లు చట్టరూపం దాల్చడంపై ఆందోళన నెలకొంది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా బిల్లు గట్టెక్కడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.