ఏపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి సెక్యూరిటీని పెంచారు. ఆయనకు ప్రస్తుతం వై కేటగిరీ భద్రత ఉండగా దాన్ని ఇప్పుడు వై-ప్లస్ కేటగిరీకి మార్చారు. అందుకు తగిన విధంగా రాష్ట్ర పోలీసుల తరఫున ఇద్దరు గన్మెన్లతో పాటుగా మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారులు ఉంటారు. మొత్తంగా రామ్మోహన్ వెంట నలుగురు సిబ్బంది భద్రతగా ఉండనున్నారు. ఆ మేరకు కేంద్రం నియమించిన చీఫ్ సెక్యూరిటీ అధికారి, సీఆర్పీఎఫ్ కమాండో గురువారం విధుల్లో చేరారు. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు కొనసాగుతుండటంతో ముందస్తు జాగ్రత్తగా కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడికి(Ram Mohan Naidu) కేంద్రం భద్రత పెంచింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలు
అటు ఆపరేషన్ సిందూర్ తరువాత వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ప్రజలు, సంస్థల రక్షణ, వీఐపీల భద్రతపై ఏపీలో ఉన్నతాధికారులు హైలెవల్ రివ్యూ చేశారు. ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటిలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్హాతో పాటు ఉన్నతాధికారులు సమీక్షకు హాజరు అయ్యారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు(CM ChandraBabu) సెక్యూరిటీ విషయంలో పటిష్ట చర్యలకు డీజీపీ ఆదేశించారు.మరింత పటిష్టంగా ముఖ్యమంత్రి భద్రతా చర్యలు ఉండాలని ఇంటలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.సెక్యురిటీ ప్రొటోకాల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. జన సమూహంలోకి సీఎం చంద్రబాబు వెళుతున్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు.

సంకేతంగా
మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘దేశ ప్రజలందరికీ నా విజ్ఞప్తి! భారతదేశ సమగ్రతను దెబ్బతీయాలని శత్రుదేశం కుట్రలు పన్నుతున్న వేళ మనందరం కలిసికట్టుగా భారత ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంకేతంగా మీ యొక్క ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా అక్కౌంట్లలో ఈ డిపిని పెట్టుకోండి. వందేమాతరమంటూ నినదించండి’ అన్నారు. అందరూ డీపీని మార్చుకోవాలన్నారు.
Read Also: AP Liquor Scam : లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం..రంగంలోకి ఈడీ!