అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన – మోదీ విచ్చేస్తున్న వేళ కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి మే 2న శంకుస్థాపన చేయనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి దిశగా తిరుగులేని మైలురాయిగా నిలవనుంది. పునర్నిర్మాణ కార్యకలాపాల ప్రారంభానికి ప్రధానమంత్రి హాజరుకానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఈ సందర్భంగా అమరావతిలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఆ సభలో ప్రధాని పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ మహాసభకు వచ్చే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రత్యేక కళా ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ శిల్పి కుటుంబం ఆటో మొబైల్ స్క్రాప్తో తయారుచేసిన విభిన్న విగ్రహాలను సభా ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. వీరిలో ప్రధాన ఆకర్షణగా ఉండబోయేది – ఆటో స్క్రాప్తో తయారైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విగ్రహం.
స్క్రాప్లో శిల్పకళ – తెనాలి శిల్పుల ప్రతిభకు చిరునామా
తెనాలికి చెందిన సూర్య శిల్పశాల వారు – కాటూరి వెంకటేశ్వరావు, ఆయన కుమారులు రవిచంద్ర, సూర్య కుమార్లు – ఈ విగ్రహాలను రూపొందించారు. స్క్రాప్ మాద్యమంగా మోడ్రన్ ఆర్ట్ రూపంలో విగ్రహాల రూపకల్పనలో వీరు నిపుణులు. ఆటో మొబైల్ రంగంలో ఉపయోగించే పాత నట్టులు, బొల్టులు, ఐరన్ స్క్రాప్తో రూపొందించిన ఈ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీరు ఇప్పటికే ఎన్నో బహుమతులు పొందిన అనుభవజ్ఞులైన శిల్పులు.
ఈ కార్యక్రమం కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ శిల్పాల్లో మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్ధుడు, సింహం, బైసన్, జీపు, సైకిల్ వంటి విభిన్న విగ్రహాలను రూపొందించారు. అలాగే తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన సైకిల్ను కూడా ఐరన్ స్క్రాప్తో ప్రత్యేకంగా రూపొందించి ప్రదర్శనకు ఉంచారు.
‘వెలకమ్ అమరావతి’ ఆకర్షణ – తీగలతో నక్షత్రాలలా
కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, “వెలకమ్ అమరావతి” అనే లెటర్స్ను కూడా తీగలతో రూపొందించి ప్రత్యేక ప్రదర్శనగా నిలిపారు. ఇవి రాత్రి సమయంలో ప్రత్యేకంగా వెలిగేలా డిజైన్ చేశారు. సభ ప్రాంగణంలోకి వచ్చే ప్రతీ ఒక్కరినీ ఆహ్వానించే విధంగా ఈ లెటర్స్ను నిలబెట్టారు. ఈ కళాప్రదర్శనను చూసేందుకు వచ్చేవారు, ముఖ్య అతిథులు మెచ్చుకోకుండా ఉండలేరు.
అమరావతిలో కళా చైతన్యం – శిల్పులను అభినందిస్తున్న ప్రజలు
ఈ వినూత్న శిల్పాలను చూసిన పలువురు కళాప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజలు వీరి ప్రతిభను అభినందిస్తున్నారు. తెనాలి ప్రాంతం శిల్పకళకు పెట్టిందిపేరని, గతంలోనూ ఎన్నో పురస్కారాలను పొందినట్లు శిల్పులు తెలిపారు. తమ కలల రాజధాని అమరావతిలో జరుగుతున్న ఈ పునర్నిర్మాణ యాత్రకు తాము చేసిన చిన్న ప్రయత్నమేనని వినమ్రతతో చెబుతున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణానికి ఓ నూతన శకం ప్రారంభించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇది పెద్ద ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని కలిగించే ఘట్టంగా నిలవనుంది.
READ ALSO: Simhachalam : కోటి డిమాండ్ చేస్తున్న బాధితులు