ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రపంచంలో పురాతన కట్టడాలు, దేవాలయాలు, స్మారక చిహ్నాలు మన సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఇవి మానవ నాగరికత యొక్క చరిత్రను ప్రతిబింబిస్తూ, మన మూలాలను గుర్తు చేస్తూ మనకు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తున్నాయి. ఈ కట్టడాలు సహజంగా ఏర్పడినవి కావచ్చు లేదా మానవుల చేత నిర్మితమైనవిగా ఉండవచ్చు. UNESCO గుర్తించిన ఈ వారసత్వ సంపదను కాపాడటం మనందరి బాధ్యతగా మారింది.ప్రతి ఏప్రిల్ 18వ తేదీన “అంతర్జాతీయ స్మారక చిహ్నాలు, ప్రదేశాల దినోత్సవం” (International Day of Monuments and Sites)ను పాటించడం 1983 నుంచి కొనసాగుతోంది. ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం మానవాళిని మన వారసత్వ కట్టడాల పరిరక్షణ పట్ల చైతన్యవంతులను చేయడం. 2025లో ఈ దినోత్సవం యొక్క ఇతివృత్తం “విపత్తులు, సంక్షోభాల నడుమ వారసత్వ సంపదను కాపాడటానికి 60 ఏళ్ల ICOMOS కార్యాచరణ”గా నిర్ణయించారు.ప్రపంచవ్యాప్తంగా UNESCO గుర్తించిన 1,092 వారసత్వ ప్రదేశాలున్నాయి. వీటిలో 845 సాంస్కృతిక, 209 సహజ, 38 మిశ్రమ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. ఇటలీ, చైనా, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అత్యధిక సంఖ్యలో ఈ వారసత్వ ప్రదేశాలున్నాయి. భారత్లో ఇప్పటి వరకు 43 వారసత్వ కట్టడాలకు UNESCO గుర్తింపు లభించింది. ఇందులో అజంతా, ఎల్లోరా గుహలు, తాజ్ మహల్, రామప్ప దేవాలయం, శాంతినికేతన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి.

విపత్తుల మధ్య వారసత్వ కట్టడాలను కాపాడటం – మన భవిష్యత్ బాధ్యత
ఈ కట్టడాలు కేవలం చారిత్రక ప్రాముఖ్యత కలిగినవి మాత్రమే కాక, పర్యాటక, విజ్ఞాన, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలిగినవి. అయినప్పటికీ, ఇవి ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు, మానవీయ విపత్తుల కారణంగా నశించడపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వాలు, సంస్థలు, కళాకారులు, యువత, పౌర సమాజం అందరూ కలసి వారసత్వ కట్టడాలను రక్షించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.మన వారసత్వ సంపద మన గర్వకారణం మాత్రమే కాకుండా, మన భవిష్యత్ తరాలకు ఇచ్చే ఆధ్యాత్మిక, సాంస్కృతిక బహుమతి కూడా. కనుక, ఇవి మన బాధ్యతగా భావించి, వాటిని పరిరక్షించి, భావితరాలకు అందించడమే మన పునీతమైన కర్తవ్యం.
Read More : Travis Head: రోహిత్ శర్మను చూసి ప్రేరణ పొందాను:ట్రావిస్ హెడ్