ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హల్ చల్కు కారణమైన లిక్కర్ స్కాం కేసులో ఇటీవల మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్లో అదుపులోకి.. విజయవాడకు తరలింపు
శ్రీధర్రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో సిట్ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వెంటనే విజయవాడకు తరలించి, నేడు ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి మే 6వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. సిట్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం, గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్త మద్యం విధానం పేరుతో భారీగా అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు సుమారుగా రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు అక్రమ వసూళ్లు జరిగాయని తెలిసింది. ఈ వ్యవహారంలో శ్రీధర్ రెడ్డి కూడా కీలక సమావేశాల్లో పాల్గొన్నట్లు సిట్ నివేదికలు స్పష్టం చేశాయి.
కీలక సమావేశాల్లో పాల్గొన్న నేతలు
ఈ కుట్రలో భాగంగా జరిగిన కీలక సమావేశాల్లో శ్రీధర్రెడ్డి కూడా పాల్గొన్నారని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశాల్లో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కెసిరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అదే సంస్థ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ వంటి వారు కూడా పాల్గొన్నట్లు కేసు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సిట్ అధికారులు శ్రీధర్రెడ్డిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
Read also: YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో రంగన్న భార్యకు సిట్ నోటీసులు