గర్భిణికి సీటు ఇచ్చిన బస్సు కండక్టర్..సస్పెన్షన్ వేటు వేసిన మేనేజర్
ఆర్టీసీ బస్సులో కొన్ని సీట్లు కొంతమందికి కేటాయిస్తారనే సంగతి తెలిసిందే. ఆయా సీట్లలో వారు వచ్చినప్పుడు వేరు వాళ్ళు కూర్చున్న లేచి వారికే ఇవ్వాలి..వృద్దులు , గర్భిణి స్త్రీలు ఇలా కొందరికి ప్రత్యేక సీట్లు అనేవి ఉంటాయి. ఆలా గర్భిణి కి సీటు ఇచ్చినందుకు కండక్టర్ ఫై సస్పెన్షన్ వేటు పడిన ఘటన జనగాం లో చోటుచేసుకుంది. జనగామ బస్సులోకి ఓ గర్భిణి బస్సు ఎక్కింది. అప్పటికే బస్సు నిండిపోయి ఉండటంతో గర్భిణికి సీటు ఇవ్వాలని ఓ మహిళా ప్రయాణికురాలిని కండక్టర్ శంకర్ కోరాడు. కానీ అందుకు ఆ మహిళా ప్రయాణికురాలు నిరాకరించింది. దీంతో కండక్టర్కు, మహిళా ప్రయాణికురాలికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మహిళా ప్రయాణికురాలు మధ్యలోనే దిగిపోయింది.
మధ్యలోనే బస్సు దిగిన ఆ ప్రయాణికురాలు వెంటనే ఆర్టీసీ అధికారులకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫిర్యాదు చేసింది. దీనిపై జనగామ డిపో మేనేజర్ స్వాతి స్పందించారు. ఎలాంటి విచారణ జరిపించకుండా సదరు కండక్టర్ను విధుల నుంచి తొలగించినట్లు మెమో జారీ చేశారు. దీనిని నిరసిస్తూ డిపో కండక్టర్లు ఆందోళకు దిగారు. కండక్టర్ శంకర్, అతని కుటుంబసభ్యులతో కలిసి జనగామ డిపో ముందు ఆర్టీసీ సిబ్బంది ధర్నాకు దిగారు. సస్పెండ్ చేసిన కండక్టర్ శంకర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.