కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం అమ్మకాల్లో భారీ వృద్ధి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ వివరాల ప్రకారం..గత మూడు రోజుల్లోనే రూ.565 కోట్ల విలువైన మద్యం డిపోల నుండి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. ఈ తరహా అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డిసెంబర్ నెల మొదటి అర్ధభాగంలో మద్యం అమ్మకాలు సాధారణ స్థాయిని దాటినట్లు అధికార వర్గాలు తెలిపారు. కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని, స్టాక్ను ముందుగానే డిపోల నుండి పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈరోజు మద్యం డిపోలకు సెలవుదినం ఉన్నప్పటికీ స్టాక్ను విస్తృతంగా పంపిణీ చేయడానికి డిపోలను ఓపెన్ ఉంచనున్నారు. దీని వల్ల నెలాఖరుకు లక్షల మంది వినియోగదారుల డిమాండ్ను తీరుస్తారని అధికారులు తెలిపారు. ప్రధాన నగరాల్లో మద్యం బార్లు, షాపులు ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారంలో ప్రత్యేకంగా కొత్త సంవత్సరం రాత్రి, మద్యం అమ్మకాలు గత రికార్డులను అధిగమించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నెలాఖరుకు మొత్తం రూ.1000 కోట్ల విలువైన అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.