భారత రక్షణ రంగ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలిచే విధంగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందిస్తున్న హ్యూమనాయిడ్ రోబో ప్రాజెక్ట్ దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆధునిక సాంకేతికతను వినియోగించి, సైనిక మానవ వనరులను పరిమిత స్థాయిలో వినియోగిస్తూ, ప్రాణహాని కలిగించే ఆపరేషన్లలో సురక్షితంగా ముందడుగు వేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

ప్రాణ నష్టం లేకుండా విజయవంతమైన ఆపరేషన్లు
ఈ రోబో రూపొందింపులో ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టారు. అటవీ ప్రాంతాలు, పర్వతాలు, సీమ సరిహద్దుల వంటి క్లిష్ట భూభాగాల్లో మానవ సైనికుల మాదిరిగా నడిచే సామర్థ్యం. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్న ఒక కీలక ఇంజనీర్ మాట్లాడుతూ, “ఈ హ్యూమనాయిడ్ రోబోను, ఆపరేటర్ ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకుని, వాటిని కచ్చితత్వంతో అమలు చేసేలా తీర్చిదిద్దుతున్నాం. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, కొండచరియలు వంటి కఠినమైన భూభాగాలపై కూడా సమర్థవంతంగా నడిచేలా దీని కాళ్లను రూపొందిస్తున్నాం” అని తెలిపారు. అంతర్గతంగా నిర్వహించిన కొన్ని కీలక పరీక్షల్లో ఈ రోబో ఇప్పటికే విజయవంతంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని అధికారులు పేర్కొన్నారు.
DRDO ప్రాజెక్టు
దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే క్రమంలో డీఆర్డీఓ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టింది. ప్రమాదకరమైన వాతావరణంలో, ముఖ్యంగా ఫ్రంట్లైన్ మిషన్లలో సైనికులు ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరాన్ని తగ్గించడమే ఈ రోబో రూపకల్పన వెనుక ప్రధాన ఉద్దేశమని డీఆర్డీఓకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. శత్రు రాడార్లను గుర్తించడం, లైవ్ ఫీడ్ ఆధారంగా వ్యూహాత్మక సమాచారం పంపడం వంటి ఫీచర్లను కలిగి ఉంది. ప్రత్యేకంగా ఇండియన్ ఆర్మీ యూనిట్లతో కలిసి రోబోకు మిలిటరీ డ్రిల్స్ చేస్తూ, శిక్షణను అందిస్తున్నారు. మానవ సైనికులకు బదులుగా ఈ రోబోలు శత్రువుల కాల్పులను ఎదుర్కోవడం, నిఘా కార్యకలాపాలు చేపట్టడం వంటివి చేయగలవని ఆయన వివరించారు.
2027 నాటికి భారత సైన్యంలో ప్రవేశం
ప్రస్తుతం ఈ రోబో ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, ఆపరేటర్ల నుంచి అందే ఆదేశాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, సంక్లిష్టమైన పనులను కూడా పూర్తిచేయగల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శాస్త్రవేత్తల బృందం నిరంతరం కృషి చేస్తోంది. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, భారత సైన్యానికి ఈ అధునాతన రోబోలను అందించాలనే లక్ష్యంతో పరిశోధకులు ముందుకు సాగుతున్నట్లు డీఆర్డీఓ వర్గాలు వెల్లడించాయి. ఈ హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి వస్తే, భారత సైనిక సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read also: AI-Based Data Center : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్