తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిపిక్కల లారీ బోల్తా పడి ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. జంగారెడ్డి గూడెం నుంచి పెరవలి వెళ్తుండగా చిన్నాయిగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరిపాటిదిబ్బలు – చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో మినీలారి అదుపు తప్పి పంటబోదెల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాద సమయంలో మినీలారీలో 10మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

ఇందులో డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు తాడిమళ్లకు చెందిన బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ గా గుర్తించారు.