బావ కళ్లలో ఆనందం కోసమే మీసాలు మెలేసినట్లుగా ఉందిః రోజా

సభలోనే రండిరా కొట్టుకుందామన్నట్లుగా ప్రవర్తిండమేమిటని ప్రశ్న

rk-roja-fires-on-balakrishna

అమరావతిః టిడిపి ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఆమె మాట్లాడుతూ… అసెంబ్లీ అంటే బాలకృష్ణకు షూటింగ్ స్పాట్‌లా కనిపిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. సభలోనే ఆయన మీసాలు తిప్పడం చూస్తుంటే దానిని షూటింగ్ స్పాట్‌గా భావిస్తున్నట్లుగా అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై పెట్టినవి అక్రమ కేసులు అని వారు భావిస్తే కనుక సభాపతిని మాట్లాడేందుకు సమయం అడగాలని సూచించారు. కానీ సభలోనే రండిరా కొట్టుకుందామన్నట్లుగా మాట్లాడారని, దీనిని మనం వీడియోలో (నేటి అసెంబ్లీ వీడియోలు) చూసినా అర్థమవుతుందన్నారు. టీడీపీ అధినేత అరెస్ట్‌పై మాట్లాడేందుకు టిడిపి నేతలకు సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ రూల్ ప్రకారం కాకుండా రౌడీయిజం చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు.

పబ్లిసిటీ కోసమే టిడిపి నేతలు హడావుడి చేస్తున్నారని రోజా మండిపడ్డారు. టిడిపి నేతలు ఫైల్స్ విసిరి, బాటిల్స్ పగులగొట్టి నానా హంగామా సృష్టించారన్నారు. సభా మర్యాదను అగౌరవపరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉందన్నారు. బావ కళ్లలో ఆనందం చూసేందుకు మీసాలు మెలేసినట్లుగా ఉందన్నారు. టిడిపి అధినేత అవినీతి చేసి దొరికిపోయిన దొంగ అన్నారు. అసలు ఈ తొమ్మిదేళ్లలో బాలకృష్ణ ఎన్నేళ్లు సభకు వచ్చారో చెప్పాలన్నారు. తనకు ఓటేసి గెలిపించిన హిందూపురం ప్రజల సమస్యల కోసం ఏనాడైనా సభలో మాట్లాడారా? అని నిలదీశారు. చంద్రబాబు ప్రజల డబ్బును దోచి అరెస్టయ్యాడని, అక్రమ సొమ్మును బయటకు తీస్తామన్నారు. దమ్ముంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై రావాలని, ఎంతసేపైనా చర్చించేందుకు తాము సిద్ధమన్నారు.