ఐపీఎల్ 2025 సీజన్లో శనివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై ఉత్కంఠ విజయం సాధించింది.ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో లక్నో పేసర్ అవేశ్ఖాన్ అద్భుతం చేశాడు. హెట్మైర్(12)ను ఔట్ చేసిన అవేశ్ 6 పరుగులే ఇచ్చుకుని లక్నోకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. దీంతో 181 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 178/5 కు పరిమితమైంది. యశస్వీ జైస్వాల్ (52 బంతుల్లో 74, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ ఫామ్ను కొనసాగించగా కెప్టెన్ రియాన్ పరాగ్ (39) మెరిశాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన 14 ఏండ్ల చిన్నోడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 180/5 పరుగులు చేసింది. మార్క్మ్ (45 బంతుల్లో 66, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అయుశ్ బదోని (34 బంతుల్లో 50, 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
హాఫ్ సెంచరీ
జైస్వాల్తో పాటు క్రీజులోకి వచ్చిన పాలబుగ్గల పసివాడు వైభవ్ ఈ లీగ్లో తాను ఆడిన మొదటి బంతినే భారీ సిక్సర్ కొట్టాడు. శార్దూల్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని కవర్స్ దిశగా సిక్స్ బాదాడు. అవేశ్ బౌలింగ్లోనూ సిక్స్ కొట్టిన వైభవ్ జైస్వాల్తో కలిసి తొలి వికెట్కు 8.4 ఓవర్లలో 85 పరుగులు జోడించి ఆ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. శార్దూల్ 3వ ఓవర్లో 4 ,6తో బాదుడు మొదలుపెట్టిన జైస్వాల్ మార్క్మ్ ఓవర్లోనూ రెండు సిక్సర్లతో అలరించాడు. మార్క్మ్ 9వ ఓవర్లో దురదృష్టవశాత్తూ వైభవ్ వెనుదిరిగగా రాణా (8) సైతం నిరాశపరిచాడు. కానీ తాత్కాలిక సారథి పరాగ్తో జతకలిసిన జైస్వాల్ లక్నోకు ఎలాంటి అవకాశమివ్వలేదు. 31 బంతుల్లోనే ఈ సీజన్లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖర్లో అవేశ్, జైస్వాల్, పరాగ్ను ఔట్ చేయడంతో పాటు చివరి ఓవర్లోనూ రాయల్స్ను కట్టడి చేస్తూ లక్నోకు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో వరుసగా నాలుగో మ్యాచ్లో ఓడిన రాయల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.

బౌలింగ్
ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో రాజస్థాన్ కు ఇది 6వ ఓటమి అవ్వడంతో పాయింట్ల పట్టికలో 8 స్థానంలో నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం ఓటమి గల కారణాలను తెలిపిన కెప్టెన్ రియాన్ పరాగ్ నిరాశ వ్యక్తం చేశాడు.”ఈ ఓటమి బాధను జీర్ణించుకోవడం కాస్త కష్టం. తప్పు ఎక్కడ చేశామో కచ్చితంగా చెప్పలేను. 18-19వ ఓవర్ల వరకు మ్యాచ్లో మేము పోటీలోనే ఉన్నాం. నేను 19వ ఓవర్లోనే ఫినిష్ చేయాల్సింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నాను. నన్ను నేను నిందించుకుంటున్నాను. ఒక మ్యాచ్ను మొత్తం 40 ఓవర్ల పాటు కలిసి ఆడితే తప్ప విజయం సాధ్యం కాదు. బౌలింగ్ అద్భుతంగా చేశాం. చివరి ఓవర్ లో అదృష్టం కలిసి రాలేదు. మేము వాళ్లను 165-170 వద్ద కట్టిడి చేస్తామనుకున్నాం. సందీప్ శర్మపై మాకు నమ్మకం ఉంది. కానీ అతడికి ఒక్క బ్యాడ్ గేమ్ ఇది. సమద్ చాలా బాగా ఆడాడు. మేం ఇది ఛేజ్ చేయాల్సిన మ్యాచ్. పిచ్ బానే ఉంది. కానీ ఐపీఎల్ లో కొన్ని బంతులు మాత్రమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తాయి.” అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.
Read Also: IPL 2025: ఎల్ఎస్ జి మ్యాచ్ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన రిషభ్ పంత్