సదుం మండలం తహశీల్దార్ కార్యాలయంలో శనివారం లంచం తీసుకుంటూ రెవెన్యూ శాఖ వీఆర్వో ఏసీబీ వలలో చిక్కాడు. రైతు షఫీ ఉల్లా అనే వ్యక్తి నుండి రూ.75,000 లంచం తీసుకుంటుండగా, వీఆర్వో మహబూబ్ బాషాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ ఎస్పీ ఎస్.వి. ప్రశాంతి ఈ దాడులపై పూర్తి వివరాలను వెల్లడించారు.
60 సెంట్ల భూమిని సెటిల్మెంట్
షఫీ ఉల్లా అనే రైతు ఐదు ఎకరాల 60 సెంట్ల భూమిని సెటిల్మెంట్ ల్యాండ్గా పరిగణించి అసైన్మెంట్గా రిజిస్టర్ చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు రూ.1,50,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మొత్తం ఎక్కువగా ఉందని భావించిన రైతు, చివరకు ఎమ్మార్వోతో రూ.75,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయినప్పటికీ లంచం ఇవ్వడం తనకు ఇష్టం లేకపోవడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
ఆధారాలతో కూడిన సమాచారంతో శనివారం ఏసీబీ అధికారులు వేషధారణలో కార్యాలయం వద్ద మోహరించి, లంచం తీసుకుంటున్న సమయంలో వీఆర్వో మహబూబ్ బాషాను అడ్డగించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఎస్పీ ఎస్.వి. ప్రశాంతి తెలిపారు. ఈ ఘటనతో అధికార విభాగాల్లో కలకలం రేగింది.