ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అక్కసుతో నిండి ఉన్నాయని, ఆయన మాటల్లో స్పష్టత లేకపోవడం బాగా కనిపించిందని విమర్శించారు.

రాష్ట్ర ఖజానాపై ఆరోపణలు
రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చి వెళ్లిన వారే ఇప్పుడు తప్పుబడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు ఇక బీఆర్ఎస్ను విశ్వసించే పరిస్థితిలో లేరని, పార్టీ అధినేత కేసీఆర్ మాటల్లో అసురక్షిత భావం కనిపించిందని పేర్కొన్నారు. తనకు మరియు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య దూరం పెరిగిందని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్న అంశాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. రాహుల్ గాంధీతో నా అనుబంధాన్ని ప్రత్యేకంగా చెబాల్సిన అవసరం లేదు అని తేల్చిచెప్పారు. అలాంటి ఆరోపణలు చేసి పార్టీని బలహీనపర్చే కుట్రలను ప్రజలు గుర్తించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వైఖరులు మార్చుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. గతంలో మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, ఇప్పుడు రాజకీయ అవసరాలకోసం మోచేయి ఇవ్వడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. దేశానికి ఇప్పుడు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తరహా ధైర్యవంతమైన నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని మావోయిస్టు సమస్య పరిష్కారానికి చర్చలు జరిపే ఉద్దేశంతో శాంతి కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ ఏర్పాటుపై జానా రెడ్డి మరియు మరో సీనియర్ నేత కె. కేశవరావు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు.
ఎమ్మెల్యేలకు హెచ్చరిక
ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని, వారి ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరవేయాలనే సూచనలు చేశారు. పార్టీ పట్ల నిబద్ధత, ఓపిక ఉండే వారికి పదవులు లభిస్తాయని చెప్పారు. మీడియా వేదికలలో లేదా ప్రజల ముందుగా ఇష్టానుసారంగా మాట్లాడితే, పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉంటుందని ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు.
Read also: Rajiv Yuva Vikasam Scheme : ఈ కేటగిరీలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు