కెటిఆర్ సవాల్ ను నేను స్వీకరిస్తున్నా: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పదేళ్లు, బిఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై చర్చకు టీపీసీసీ చీఫ్ రెడీ

revanth-reddy-ready-to-ktr-challenge

హైదరాబాద్‌ః 2004 నుండి 2014 వరకు, 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలన్న మంత్రి కెటిఆర్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నాటి కాంగ్రెస్ పదేళ్లు, ఇప్పటి బిఆర్ఎస్ దాదాపు తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, అధికార పార్టీ నుండి కెటిఆర్, హరీశ్ రావులు సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని తాను ప్రజలను కోరుతున్నానని చెప్పారు. అత్యంత కీలకమైన ఐదు అంశాలతో ప్రజల వద్దకు వెళ్తామని, కీలక నేతలు అందుబాటులో ఉండే అవకాశాన్ని బట్టి బహిరంగ సభలు ఉంటాయని చెప్పారు. కర్ణాటకలో గెలిచినట్లుగా తెలంగాణలోను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో కెసిఆర్ ను గద్దె దించాలంటే యూత్ కాంగ్రెస్ క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. గడీల పాలనను పునరుద్ధరించేందుకు కేసీఆర్ ధరణి పోర్టలను తీసుకు వచ్చారని ఆరోపించారు. కొద్దిమంది భూస్వాముల కోసమే ధరణిని తీసుకు వచ్చారని, అధికారంలోకి వచ్చాక దీనిని తాము కచ్చితంగా రద్దు చేస్తామన్నారు. వేల ఎకరాల భూమిని బినామీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం దళారుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ధరణి రాకముందుకు కూడా రైతు బంధు వచ్చిందని గుర్తు చేశారు.

పార్టీ కోసం, ప్రజల కోసం పోరాడే వారికి భవిష్యత్త ఉంటుందన్నారు రేవంత్. బిజెపి దృష్టిలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అని ఎద్దేవా చేశారు. దేశాన్ని దోచుకోవడమే డబుల్ ఇంజిన్ సర్కార్‌ అని నిలదీశారు. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బిజెపి రహస్య అజెండా అని ఆరోపించారు. బిజెపి కుట్రను ఛేదించి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు.