- హామీలను నెరవేర్చకుండా, మోసం చేస్తున్న వ్యక్తి
- రేవంత్ పాలన పూర్తిగా విఫలం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మోసం చేస్తున్న వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. “కేసీఆర్ హయాంలో రైతులకు రూ.10,000 రైతుబంధు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రూ.15,000 అందిస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు రూ.12,000 మాత్రమే అంటున్నారు. అసలు ఆ మొత్తాన్ని కూడా ఇప్పటివరకు అందించలేకపోయారు” అని కేటీఆర్ విమర్శించారు.

అంతేకాదు, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రుణమాఫీ, బోనస్, మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రిని తిట్టనంతగా రేవంత్ రెడ్డిని తిడుతున్నారని, ఆయన పాలన పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కేవలం ఓట్ల కోసమే అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమాత్రం మేలు జరగలేదని కేటీఆర్ ఆరోపించారు. “తులం బంగారం ఇవ్వడం కాదు, మహిళల మెడలో ఉన్న పుస్తెలతాడు కూడా తీసుకెళ్తాడనే పరిస్థితి వచ్చింది” అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని, త్వరలోనే తెలంగాణలో మార్పు అనివార్యమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉధృతతను తెచ్చాయి.