బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా.. దేశం వీడిన షేక్ హసీనా..?
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆ దేశంలో హింస చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన ఘర్షణల్లో 100 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 300 మంది చనిపోయారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ఢాకాలోని తన ప్యాలెస్ను వీడిన ప్రధాని షేక్ హసీనా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. ఆందోళనలు ఉధృతం కావడంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉండగా, షేక్ హసీనా హెలికాప్టర్లో ఢాకా నుంచి భారత్కు వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. షేక్ హసీనా, ఆమె సోదరి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి ఢాకా అధికార భవన్ నుంచి బయలుదేరారని మీడియాలో వార్తలు వచ్చాయి. షేక్ హసీనా వీడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలనుకున్నారు. కానీ లక్షలాదిమంది నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం వైపు దూసుకు రావడంతో ఆమెకు సమయం లభించలేదు.
కాగా, షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో దేశ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నట్లుగా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ప్రకటించారు. ఈ సందర్భంగా, హింసకు ముగింపు పలకాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో శాంతిభద్రతల నిర్వహణ బాధ్యత సైన్యానిదే అన్నారు.