ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయండి : కేంద్ర మంత్రులకు నాదెండ్ల విజ్ఞప్తి
అమరావతి: ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని గుర్తుచేస్తూ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ఈమేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. కందిపప్పు కొరతతో ఇబ్బంది పడుతున్నామని, వెంటనే లక్ష మెట్రిక్ టన్నుల కందిపప్పు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. దీపం కనెక్షన్ల విషయంపై సీఎం చంద్రబాబు రాసిన లేఖను కేంద్రమంత్రికి అందజేశారు.
ఏపీలో ధరల స్థిరీకరణకు రూ.532 కోట్ల నిధులను, అదేవిధంగా బకాయి నిధులు రూ.1187 కోట్లను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. వీటితో పాటు ఏపీలోని పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామని, మంత్రులు సానుకూలంగా స్పందించారని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఏపీలోని సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. నవంబర్ నాటికి కందిపప్పు సమస్య పరిష్కరిస్తామని, రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తామని చెప్పారన్నారు.
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ అంటూ గత ప్రభుత్వం రూ.1800 కోట్లు వృథా చేసిందని మంత్రి నాదెండ్ల విమర్శించారు. రేషన్ బియ్యాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా అక్రమంగా తరలించారని ఆరోపించారు. రేషన్ డోర్ డెలివరీపై కేబినెట్లో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన అందరికీ త్వరలోనే రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. రైతులకు పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1674 కోట్లను చెల్లిస్తున్నామని, ఇందులో ఇప్పటికే రూ.1000 కోట్లు రైతులకు అందజేశామని వివరించారు. మిగతా రూ. 674 కోట్లను సోమవారం చెల్లిస్తామని తెలిపారు.