ఢిల్లీ రాజధానిలో పాఠశాలల అధిక రుసుముల వసూళ్లపై పెద్ద దుమారం రేగింది విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కొన్నిపాఠశాలలు ఎటువంటి సమాచారం లేకుండా ఫీజులను భారీగా పెంచడం, పిల్లలను వేధించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు.

ఇష్టానుసారంగా ఫీజులు పెంచే పాఠశాలలకు ఇకపై చుక్కెదురవుతుందని సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు.పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తే, వారి రిజిస్ట్రేషన్ను కూడా రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు.ప్రజలపై, ముఖ్యంగా తల్లిదండ్రులపై ఆర్ధిక భారం మోపే చర్యలను ప్రభుత్వం ఏకంగా వ్యతిరేకిస్తోంది.మోడల్ టౌన్లోని క్వీన్ మేరీ స్కూల్ లో ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడింది.అక్కడి యాజమాన్యం విద్యార్థులను వేధించిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై స్పందించిన తల్లిదండ్రులు సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఫిర్యాదు అందిన వెంటనే సీఎం వెంటనే స్పందించి అధికారులను రంగంలోకి దింపారు.తల్లిదండ్రుల ఆవేదనను గమనించిన ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలకు ఆదేశించారు.
ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంగా చెప్పారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.”ప్రతి పిల్లవాడికి న్యాయం జరగాలి, గౌరవంగా విద్యలభించాలి” అన్నది మా ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. పిల్లలపై వేధింపులు, అనవసర భయాలు, ఆర్థిక బాద్యతలు మోపడం తప్పని ఆమె తెలిపారు. “విద్య ఒక హక్కు, అది వ్యాపారం కాదు” అనే మాటకు జీవం పోసేలా ఆమె ప్రకటన సాగింది.పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడే యాజమాన్యాలను ఉపేక్షించేది లేదని సీఎం చెప్పిన మాటలు తల్లిదండ్రులకు భరోసా కలిగించాయి. ఇకపై ఏ స్కూల్ అయినా నిబంధనలు తప్పక పాటించాలి. లేని పక్షంలో రిజిస్ట్రేషన్ రద్దు సహా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది – విద్యా రంగంలో ఎవరూ ఇష్టానుసారంగా వ్యవహరించలేరు. ప్రభుత్వం ప్రజల పక్షాన నిలవడం, ముఖ్యంగా విద్యార్థుల హక్కులకు రక్షణగా నిలబడటం, ప్రజలకు ఎంతో భరోసా కలిగిస్తోంది. పాఠశాలల రుసుములపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
Read Also : Retail Inflation : కూరగాయలు, ప్రొటీన్ల ధరలు తగ్గడమే ప్రధాన కారణం.