ఉక్రెయిన్తో శాంతి చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతిని నెలకొల్పేందుకు అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా దేశ అధికారిక వార్తా చానెల్లో మాట్లాడిన పుతిన్ ఈ మేరకు చెప్పారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఉక్రెయిన్ నుంచి కూడా ఇదే ఆశిస్తున్నామని తెలిపారు.

జెలెన్స్కీ స్పందన
అయితే, పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరోక్షంగా స్పందించారు. కాల్పుల విరమణ ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈ వివాదం ముగింపు లక్ష్యంగా అమెరికా, యూరప్ దేశాల ప్రతినిధులతో చర్చించడానికి ఉక్రెయిన్ ఉన్నతి స్థాయి బృందం లండన్కు వెళ్తుందని తెలిపారు.
ఒకవైపు శాంతి చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ మరోవైపు రష్యా- ఉక్రెయిన్లు మాత్రం దాడులను చేసుకుంటూనే ఉన్నాయి. ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించిన రష్యా, దానిని అమలు చేయలేదు. ఆదివారం కీవ్పై పదులకొద్దీ డ్రోన్, బాంబు దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
ఈ వారంలోనే శాంతి ఒప్పందం: ట్రంప్
మరోవైపు ఉక్రెయిన్, రష్యాలు యుద్ధం విరమణపై తొందరగా ఒక ఒప్పందానికి రాకపోతే శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి విరమించుకుంటామన్న అమెరికా.. ఇప్పుడు ఈ వారంలోనే యుద్ధం ఆగే అవకాశాలున్నాయని చెబుతోంది. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం ఈ వారంలోనే కుదిరే అవకాశం ఉందంటూ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్’ లో పోస్టు చేశారు. ఈ రెండు దేశాలు తమతో కలిసి భారీగా వ్యాపారం చేయబోతున్నాయని కూడా వెల్లడించారు. వ్యాపార ఒప్పందాల నుంచి ఆ దేశాలు తమతో కలిసి సంపద గడిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ అభివృద్ధికి ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.
Read Also: Donald Trump: తరచూ వివాదాల్లో ట్రంప్..ఆర్డర్లపై తీవ్ర వ్యతిరేకత