రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులు

ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ గురువారం విజయవాడలోని కానూరులో జరిగింది. ఈ సంస్మరణ సభకు అతిరథ మహారథులు హాజరయ్యారు. రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్, మనోహర్‌, సత్యకుమార్‌, కొల్లు రవీంద్ర, పార్థసారథి పాల్గొన్నారు.

సినీ ప్రముఖులు మురళీమోహన్, జయసుధ, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, అశ్వినీదత్‌, ఆదిశేషగిరిరావు, దగ్గుబాటి సురేష్‌, శ్యాంప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తిలకించారు. వేదిక వద్ద రామోజీరావుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, లోకేశ్ పుష్పాంజలి ఘటించారు.

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. 8 జూన్ 2024 న తుదిశ్వాస విడిచారు. జూన్ 10 న రామోజీఫిల్మ్ సిటీ లో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.