తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజా సింగ్ మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేకపోవడానికి కారణం పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలే అని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ అధికారంలోకి రావాలంటే సీనియర్ నేతలు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చోవాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కొన్ని సీనియర్ నేతలు, ఇతర పార్టీల ముఖ్య నేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారని, ఇలాంటి వ్యక్తులను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

సీనియర్ నేతలపై రాజా సింగ్ అసహనం
రాజా సింగ్ పార్టీ సీనియర్ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు. గత కొన్ని నెలలుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ బలహీనంగా మారడంపై, పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన కీలక నేతలు సరైన పని చేయడం లేదని విమర్శిస్తున్నారు. తెలంగాణలో హిందువులకు రక్షణ కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. కానీ, కొందరు బీజేపీ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నేతలతో రహస్యంగా భేటీ అవుతున్నారు. ఎవరైతే ప్రత్యర్థి పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో, వారిని వెంటనే బహిష్కరించాలి. అలాంటి వాళ్ల వల్లే పార్టీ బలహీనపడుతోంది అని రాజా సింగ్ అన్నారు. రాజా సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఇప్పటివరకు స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. అయితే, లోపాయికారీ వ్యవహారాలు బీజేపీకి మేలు చేయవని, ప్రతి ఒక్కరూ పార్టీ నియమాలను గౌరవించాలని నేతలు సూచిస్తున్నారు. రాజా సింగ్ వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారు. కానీ, పార్టీ అంతర్గతంగా బలంగా ఉంది. మేము బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నాం అని ఓ బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించారు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీలో కొనసాగుతారా? లేక పార్టీ నుంచి వేరే మార్గాన్ని ఎంచుకుంటారా? అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆయనపై పార్టీ అధిష్ఠానం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.