Raj Kasireddy : రాజ్ కెసిరెడ్డికి మద్యం కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు న్యాయాధికారి భాస్కరరావు మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. అంతకుముందు కెసిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా న్యాయాధికారి ప్రాథమిక దశలో అభ్యంతరం వ్యక్తంచేశారు. సీఐడీ కోర్టులో కదా హాజరుపరచాల్సింది అని వ్యాఖ్యానించారు. ఓ దశలో రిమాండ్ను తిరస్కరిస్తాను, మెమోను సవరించుకొని సీఐడీ కోర్టులో హాజరుపరచండి అని సూచించారు.

ఆ కార్పొరేషన్లో ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు
సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పీపీ కల్యాణి వాదనలు విన్పిస్తూ..అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)తో ఈ కేసు ముడిపడి ఉంది. నిందితుడు కెసిరెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించే విచారణాధికార పరిధి ఏసీబీ కోర్టుకు ఉంది. ఇదే కేసులో మూడో నిందితుడు, అప్పటి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ను పీసీ చట్టం కింద విచారించేందుకు కాంపిటెంట్ అథార్టీ నుంచి సెక్షన్ 17(ఏ) అనుమతి లభించింద ని న్యాయాధికారి దృష్టికి తెచ్చారు. కెసిరెడ్డి విషయంలో 17(ఏ) అనుమతి అవసరం లేదా? అని న్యాయాధికారి భాస్కరరావు ప్రశ్నించగా, అవసరం లేదని ఏజీ బదులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా ఉంటూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో అధికారులను కెసిరెడ్డి ప్రభావితం చేశారు. ఆ కార్పొరేషన్లో ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు. అందులో అధికారిక విధులు నిర్వర్తించలేదు. కాబట్టి 17(ఏ) అనుమతి అవసరం లేదు అని వాదించారు.
మే 6 వరకు రిమాండ్
నిందితుడు కెసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదిస్తూ, రిమాండ్ విధించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదు. అరెస్ట్కు గల కారణాలను పేర్కొంటూ సోమవారం నిందితుడికి అందజేసిన మెమోలో పీసీ యాక్టులోని సెక్షన్లు లేవు. తాజాగా సీఐడీ అందజేసిన రిమాండ్ రిపోర్టులో పీసీ యాక్ట్ సెక్షన్లు చేర్చారు. రిమాండ్ను తిరస్కరించాల ని కోరారు. దమ్మాలపాటి జోక్యం చేసుకొని, రిమాండ్ నివేదికలో పీసీ యాక్ట్ ప్రస్తావన ఉంటే చాలన్నారు. ఏ3 విచారణ నిమిత్తం సెక్షన్ 17(ఏ) అనుమతి లభించిన విషయాన్ని గుర్తుచేశారు. రిమాండ్ను డిఫెండ్ చేసుకోవడానికి నిందితుడికి అన్ని వివరాలు అందజేశామన్నారు. తన వాదనలకు బలం చేకూరేలా పలు తీర్పులను ఉటంకించారు. రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంలో కెసిరెడ్డి కీలక పాత్ర పోషించారని, నేర తీవ్రత దృష్ట్యా నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నిందితుడికి మే 6 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు.
Read Also: నేడే ఏపీ టెన్త్ ఫలితాలు